ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను టెక్కలి వైసీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించింది.
దువ్వాడ శ్రీనివాస్, జగన్
అమరావతి, ఈవార్తలు : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను టెక్కలి వైసీపీ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దువ్వాడ కుటుంబ సమస్యలు పార్టీకి తలనొప్పిగా మారడంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి పార్టీలో, రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. కిల్లి కృపారాణికి అవకాశం వరిస్తుందని అనుకున్నా.. దువ్వాడను తప్పిస్తే కిల్లి కృపారాణి, పేరాడ తిలక్కు పార్టీ టెక్కలి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నా.. పేరాడ తిలక్ వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. గతంలో ఇన్చార్జిగా పనిచేసిన అనుభవం ఉన్నందున ఆయనకే జగన్ ఓటేశారు.
కుటుంబ కలహాలు దూరం చేసిన పదవి
వాస్తవానికి ఎన్నికల ముందు వరకు దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఇన్చార్జిగా కొనసాగారు. అప్పటికే వీరిద్దరి మధ్య పొసగకపోవడంతో.. గ్రూపులు ఏర్పడ్డాయి. సయోధ్య కుదురుతుందని భావిస్తే.. గ్రూపులు కట్టడంపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. తిరిగి మళ్లీ ఎన్నికల సమయంలో శ్రీనివాస్ వైపే మొగ్గు చూపారు. అయితే, తాజాగా భార్యాభర్తల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. దువ్వాడను ఇలాగే కొనసాగిస్తే పార్టీ మరింత దెబ్బతినడం ఖాయమని భావించి పార్టీ అధిష్ఠానం ఇన్చార్జిని మార్చినట్టు స్పష్టం అవుతోంది.