దసరా పండుగ సందర్భంగా సామాన్యులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ..వంటనూనెల ధర తగ్గింపు
దసరా పండుగ సందర్భంగా సామాన్యులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో కిలో పామాయిల్ రూ.110, సన్ఫ్లవర్ నూనె రూ.124కే అందించాలని నిర్ణయించింది. ఈ ధరలు ఇవాళ్టి(శుక్రవారం) నుంచి ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామాయిల్, ఒక లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ చొప్పున మాత్రమే ఇవ్వనున్నారు.
విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ధరల నియంత్రణపై వారితో చర్చించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా రాష్ట్రమంతటా ఒకే ధరపై అమ్మకాలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. దీనికి డీలర్లు, సప్లయర్స్ కూడా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ప్రతి రేషన్ కార్డుపై సన్ఫ్లవర్ ఆయిల్ను గరిష్ఠంగా 124, పామాయిల్ను రూ.110కి అమ్మేందుకు అంగీకరించారు.