ఏపీలోని రాజమండ్రిలో ఉన్న ఇంటర్నేషన్ ఏపీ పేపర్ మిల్లు (Internation AP Paper Mill) సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి లాకౌట్ ప్రకటించింది. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారంతా ఆందోళనకు దిగి.. కంపెనీ నిర్ణయంపై పోరాడుతున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
రాజమండ్రి, ఈవార్తలు : ఏపీలోని రాజమండ్రిలో ఉన్న ఇంటర్నేషన్ ఏపీ పేపర్ మిల్లు (Internation AP Paper Mill) సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీకి లాకౌట్ ప్రకటించింది. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వారంతా ఆందోళనకు దిగి.. కంపెనీ నిర్ణయంపై పోరాడుతున్నారు. ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించడంపై మండిపడ్డారు. జీతాలు పెంచాలని గత ఐదు రోజులుగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టగా, యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో.. మిల్లు వద్దకు భారీగా చేరుకున్న కార్మికులు.. యాజమాన్య నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మిల్లు వద్దకు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కార్మికులకు సూచించారు. అయితే.. తాము తగ్గే ప్రసక్తే లేదని కార్మికులు స్పష్టం చేశారు. మిల్లు లాకౌట్ ఎత్తేసి, తమకు జీతాలు పెంచాలని.. అంతవరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
పేపర్ మిల్లుగా చాలా కాలంగా కార్మికులకు జీతాలు పెంచలేదు. దీంతో కార్మికులు.. మిల్లు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. కానీ.. యాజమాన్యం నుంచి సానుకూల ప్రకటన రాలేదు. దీంతో కార్మికులు నిరసన బాట పట్టారు. అయినా.. యాజమాన్యం పట్టించుకోకపోవటంతో ఐదు రోజుల నుంచి ఉద్యమ బాట పట్టారు. కచ్చితంగా జీతాలు పెంచాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఏపీ పేపర్ మిల్లు 1898లో ప్రారంభమైంది. అంతర్జాతీయంగా గుర్తింపు రావటంతో ఇంటర్నేషనల్ ఏపీ పేపర్ మిల్లుగా మారింది.
చంద్రబాబు హామీ.. ఇంతలోనే..
ఆంధ్రా పేపరు మిల్లు కార్మికులకు అన్యాయం జరగనివ్వబోమని ఇదివరకే ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల శాఖ అధికారులు, పేపర్ మిల్లు యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి.. సమస్యను త్వరగా పరిష్కరించాలని అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రాకు సూచించారు. ఇంతలోనే మిల్లు యాజమాన్యం.. లాకౌట్ ప్రకటించడం గమనార్హం. మిల్ల యాజమాన్యం నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.