Ramoji Rao | ఈనాడు రామోజీరావు జీవితంలో ఎన్నో కేసులు.. ఎన్నెన్నో వివాదాలు

చెరుకూరి రామోజీరావు.. ఈయన తెలుగు మీడియాలో పెద్ద మనిషి. మీడియా మొఘల్ అని బిరుదు. శనివారం ఉదయం 4 గంటలకు ఆయన అస్తమించారు. ప్రస్తుతం రామోజీరావు ఘనతలను స్మరించుకోవాల్సిన సందర్భం. అయితే, ఆయన జీవితంలోనూ అనేక వివాదాలు, విమర్శలు, ఆరోపణలు, కేసులు ఉన్నాయి.

eenadu ramoji rao

రామోజీ రావు

చెరుకూరి రామోజీరావు.. ఈయన తెలుగు మీడియాలో పెద్ద మనిషి. మీడియా మొఘల్ అని బిరుదు. శనివారం ఉదయం 4 గంటలకు ఆయన అస్తమించారు. ప్రస్తుతం రామోజీరావు ఘనతలను స్మరించుకోవాల్సిన సందర్భం. అయితే, ఆయన జీవితంలోనూ అనేక వివాదాలు, విమర్శలు, ఆరోపణలు, కేసులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది టీడీపీ అనుకూల వ్యక్తిగా ముద్రపడటమే. అంతేకాదు.. మార్గదర్శి వాటాల్లో బెదిరింపులకు పాల్పడ్డారన్న కేసు నడుస్తోంది. రామోజీ ఫిలిం సిటీ కోసం వందల ఎకరాలు ఆక్రమించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో తెలంగాణ వస్తే లక్ష నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తాం అని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వ్యాఖ్యానించటం వెనుక కారణం ఇదేనని చాలా మంది భావన. ఇక, రామోజీరావుకు చెందిన చిట్‌ఫండ్ కంపెనీ.. మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలు ఎదుర్కొన్నది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ కాలంలో ఈ కేసు వేశారు. అయితే, వాటిని ఎదుర్కొని బయటపడ్డారు. మార్గదర్శిలోని ఖాతాదారుల సొత్తును రామోజీ రావు సొంత అవసరాలకు వాడుకున్నారని ఏపీ సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. ఈ కేసుపై రామోజీ రావును విచారించింది.

ఉండవల్లి ఆరోపణలు: మార్గదర్శి సంస్థ వివిధ చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారం చేస్తోందని ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం తర్వాత అనేక మలుపులు తిరిగింది.

ఏడుగురు అధికారుల ఫిర్యాదు: మార్గదర్శిపై ఏపీకి ఏడుగురు ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేశారు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతోందని ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

తుపాకీ బెదిరింపుల ఆరోపణలు: తమకు రావాల్సిన వాటాల కోసం మార్గదర్శి చిట్‌ఫండ్‌ చైర్మన్‌ రామోజీరావు వద్దకు వెళ్తే తుపాకీతో బెదిరించి బలవంతంగా తన పేరిట రాయించుకున్నారని గాదిరెడ్డి యూరిరెడ్డి ఆరోపించారు. ఈయన మార్గదర్శి వ్యవస్థాపకులు జగన్నాథరెడ్డి కుమారుడే.

చంద్రబాబు గొంతుక ఆరోపణలు: నిజాలను నిర్భయంగా బయటపెట్టగల సామర్థ్యం, తెలుగు మీడియాలోనే అత్యంత పటిష్టమైన పత్రిక.. ఇలా ఈనాడు, ఈటీవీలను వేనోళ్ల పొగుడుతారు. కానీ, అవే నోళ్లు ఈనాడు చంద్రబాబు గొంతుక అని అనేక ఆరోపణలు ఉన్నాయి. మొన్నటికి మొన్న 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి ఈనాడు బట్టలిప్పి బజారులో కూర్చొని చంద్రబాబుకు అనుకూల వార్తలు రాయించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్నో చీకటి కోణాలను బయటపెట్టిన ఈ పత్రిక.. చంద్రబాబుకు తొత్తుగా మారిందన్న విమర్శలూ ఉన్నాయి.

ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కుట్రలు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్), రామోజీరావు బంధం విడదీయలేనిది. అయితే, ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయనకు వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు ప్రచురించిందన్న అపవాదును ఈనాడు మూటగట్టుకుంది. చంద్రబాబు టీడీపీని హస్తగతం చేసుకునే సమయంలో బాబుకు పూర్తి అండదండలు అందించిందన్న ఆరోపణలు ఉన్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్