సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని అధికారాన్ని సాధించబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేశారన్నారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
నారా చంద్రబాబు నాయుడు
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని అధికారాన్ని సాధించబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేశారన్నారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా పలు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మొగ్గు చూపించాయని, కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే వైసీపీ కౌంటింగ్పై అర్థం లేని ఆరోపణలు చేస్తోందని విమర్శించిన ఆయన.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైనా కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారని ఆరోపించారు. కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలని సూచించారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పని చేయాలని, ఈవీఎంలను స్ర్టాంగ్ రూమ్లు నుంచి తీసుకువచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రాలోనే ఉండాలన్న చంద్రబాబు.. ఆర్వో వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు గది నుంచి బయటకు రావాలని సూచించారు. బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మాట్లాడుతూ ఏపీలో ఎన్డీఏకు 21 వరకు ఎంపీ సీట్లు వచ్చే అవకాశముందన్నారు. రాష్ట్రంలోనూ 53 శాతం ఓట్లతో ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందన్నారు. ప్రతి అభ్యర్థి లీగల్ టీమ్ను అందుబాటులో ఉంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.