చంద్రబాబు మరో వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తానే స్వయంగా పెన్షన్ అందజేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, ఈవార్తలు : ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతోంది. గత చంద్రబాబుకు.. ప్రస్తుత చంద్రబాబుకు తేడా చూపిస్తానని మాట ఇచ్చిన సీఎం.. అన్నట్లుగానే వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న తిరుమలలో పదరాలు తొలగించాలని ఆదేశించటం.. టీడీపీ పార్టీ ఆఫీస్లో కార్యకర్తలను కలవటం.. తదితర సంఘటనలు సరికొత్త చంద్రబాబును చూపిస్తున్నాయి. తాజాగా ఆయన మరో వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తానే స్వయంగా పెన్షన్ అందజేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను అందించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జూలై 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దే రూ.7 వేలు (చంద్రబాబు సర్కారు అందించే రూ.4 వేలు, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయి రూ.3 వేలు) స్వహస్తాలను అందిస్తారని సమాచారం. అందుకు తాడేపల్లి మండలం పెనుమాకలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే దేశ చరిత్రలో ఒక సీఎం స్వయంగా.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించడం తొలిసారి అవుతుంది. ఈ మేరకు అధికారులు కూడా గ్రామంలోని లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు.