ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. గత ఐదేళ్లుగా తాను అనుభవించిన నరకాన్ని, తాజాగా ప్రజలు అందించిన తీర్పును గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. గత ఐదేళ్లుగా తాను అనుభవించిన నరకాన్ని, తాజాగా ప్రజలు అందించిన తీర్పును గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను.. అని ప్రారంభించి ప్రమాణ పత్రంలోని ప్రతి పదాన్ని గంభీరంగా పలికారు. అనంతరం కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుండగా, ప్రధాని మోదీకి నమస్కారం చేశారు. వెంటనే ప్రధాని మోదీని హత్తుకొని మరింత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం గవర్నర్ నజీర్కు, పక్కనున్న అతిథులకు నమస్కారం చేసి, తన సీటులో ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కళ్లలో ఆనంద భాష్పాలను చూసి సభా ప్రాంగణం అంతా భావోద్వేగానికి లోనైంది. కాగా, చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు ఈ రోజు ప్రమాణం చేశారు.