రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గత ప్రభుత్వ విధానాలను సమీక్షిస్తూ నూతన నిర్ణయాలను అమలు చేస్తోంది. ఇందులో పెన్షన్లు పంపిణీ ఒకటి.
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గత ప్రభుత్వ విధానాలను సమీక్షిస్తూ నూతన నిర్ణయాలను అమలు చేస్తోంది. ఇందులో పెన్షన్లు పంపిణీ ఒకటి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్లను గ్రామ/వార్డు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరిని పక్కన పెట్టింది. వీరిని ఎలా వినియోగించుకోవలన్న దానిపై ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. నిర్ణయం తీసుకోలేదు. దీంతో జూలై నెలలో పెన్షన్ల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తొలి రెండు రోజుల్లోనే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితోపాటు ఇతర ప్రభుత్వశాఖలకు చెందిన సిబ్బంది సేవలను వినియోగించుకుంది. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రెండో నెల పెన్షన్లు పంపిణీకి సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో ఒకటో తేదీ రాబోతంది. దీంతో ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆగస్టు నెల పెన్షన్లను పంపిణీ చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూలై నెల మాదిరిగానే తొలిరోజే లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. జూలై నెలలో ప్రతి లబ్ధిదారుడికి ఏడు వేలు చొప్పున అందించగా, ఆగస్టు నెలలో పెంచిన పెన్షన్లు నాలుగు వేలు అందించనున్నారు.
ఈ పెన్షన్లు పంపిణీలో సచివాలయ సిబ్బందితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానికంగా పాల్గొననున్నారు. అదే సమయంలో స్థానికంగా ఉండే కూటమి నేతలు చేతులు మీదుగా ఈ పెన్షన్లను అందించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీన పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు.. అందుకు అనుగుణంగా ఈ నెల 31వ తేదీనే బ్యాంక్ నుంచి నగదు విత్ డ్రా చేసుకుని దగ్గర పెట్టుకోవాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.