వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఎంపికై కొద్ది రోజుల కిందటే ఆ స్థానాలకు రాజీనామా చేసిన మూడు స్థానాలకు కూటమి ప్రభుత్వం అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ వైసీపీ ఓటమి తర్వాత తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టిడిపిలో చేరగా, ఆర్ కృష్ణయ్య బిజెపి పెద్దలతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
కూటమి రాజ్యసభ అభ్యర్థులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఎంపికై కొద్ది రోజుల కిందటే ఆ స్థానాలకు రాజీనామా చేసిన మూడు స్థానాలకు కూటమి ప్రభుత్వం అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ వైసీపీ ఓటమి తర్వాత తమ రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టిడిపిలో చేరగా, ఆర్ కృష్ణయ్య బిజెపి పెద్దలతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని బిజెపి అగ్రనాయకత్వం ఖరారు చేస్తే ఆయన బిజెపిలో చేరనున్నారు. ప్రస్తుతానికి ఈ మూడు స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేనకు ఇస్తారని తొలుత అంతా భావించారు. కానీ ఇప్పట్లో జనసేనకు అవకాశం దక్కే ఛాన్స్ లేదంటున్నారు. టిడిపి రెండు స్థానాలను ఆశిస్తుండగా, బిజెపికి ఒక స్థానాన్ని కేటాయించినట్లు చెబుతున్నారు. టిడిపికి కేటాయించిన రెండు స్థానాల్లో ఒక స్థానానికి రాజీనామా చేసిన బీద మస్తాన్ రావు పేరుని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరో స్థానానికి సానా సతీష్ పేరు దాదాపు నిర్ణయమైనట్లు చెబుతున్నారు. ఈ రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఈనెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. టిడిపి తమకు దక్కిన రెండు స్థానాలకు అభ్యర్థిత్వలను ఖరారు చేసింది. నాలుగేళ్ల పదవీకాలం ఉండగానే బీద, కృష్ణయ్య రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ పదవీకాలం ఏడాదిన్నర మాత్రమే మిగిలి ఉంది. ఈ స్థానానికి సానా సతీష్ ను టిడిపి అధిష్టానం ఎంపిక చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పార్టీ నేత సాన సతీష్ వైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చూశారని చెబుతున్నారు. కొద్దిరోజుల కింద జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సతీష్ ను కాకినాడ లోక్సభ స్థానం నుంచి బరులో నెలపాలని పార్టీ భావించింది. కానీ పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భావించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సతీష్ ఎంపికపై పార్టీ అధినేత చంద్రబాబు ఒకరిద్దరూ పార్టీ ముఖ్య నేతలకు సంకేతం ఇచ్చినట్లు సమాచారం. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అండగా ఉన్న వారికి అవకాశాలు ఇవ్వాల్సి ఉందని ఆయన వారితో అన్నట్లు తెలిసింది. మరోవైపు ఆర్ కృష్ణయ్యను తమ పార్టీ తరఫున నిల్పబోతున్నట్లు బిజెపి అధిష్టానం ఇప్పటికే టిడిపి నాయకత్వానికి సమాచారాన్ని ఇచ్చినట్లు చెబుతున్నారు.
జనసేనకు మొండి చేయి..
ఖాళీ అయిన ఈ మూడు రాజ్యసభ స్థానాలను పొత్తులో భాగంగా ఒక్కో పార్టీ ఒక్కో స్థానాన్ని తీసుకుంటుందని అంతా భావించారు. జనసేనకు తొలిసారి రాజ్యసభలో అవకాశం దక్కుతుందని ఆ పార్టీ ముఖ్య నాయకులు లెక్కలు వేసుకున్నారు. అదే జరిగితే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు రాజ్యసభలో అడుగు పెడతారని అంతా అనుకున్నారు. కానీ, టిడిపి మాత్రం ఇప్పుడు ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ బిజెపి పెద్దలతో ఈ మేరకు చర్చలు కూడా జరిపారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదని తెలుస్తోంది. మరోసారి రాజ్యసభ అవకాశం వచ్చినప్పుడు కేటాయిస్తామని ఇటువైపు బిజెపి, అటువైపు టిడిపి కూడా జనసేన నాయకత్వానికి తెలియజేసినట్లు చెబుతున్నారు. దీంతో మరింతకాలం నాగబాబు నిరీక్షించక తపన పరిస్థితి ఏర్పడింది.