తెలంగాణ ఓటర్లకు ఏమైంది.. ఈ నిశ్శబ్ధ వాతావరణం ఏ పార్టీ వైపు?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

(ఈవార్తలు-సంపాదకీయం)

ఎన్నికలు అనగానే ఏ పల్లెలో చూసినా హడావుడి కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్న ప్రశ్నలే వినిపిస్తాయి. చాయ్ స్టాల్స్ మొదలుకొని హోటల్స్, రెస్టారెంట్స్ ఇలా అన్ని కమ్యూనిటీ ప్రదేశాల్లో ఉదయం నుంచి రాత్రి పడుకునేవరకు ఇవే చర్చలు కొనసాగుతాయి. గత రెండు ఎలక్షన్స్‌ను చూసుకున్నా, ఈ పార్టీకే మద్దతు అన్నట్లు ఉండేది. అయితే, గత ఎన్నికలకు భిన్నంగా తెలంగాణలో ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తల హడావుడి తప్ప, ఎక్కడా గొప్పగా కనిపించడం లేదు. ఇంకో వారంలో పోలింగ్ తేది. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా ప్రచారం గొప్పగా సాగడం లేదు. ఏ పార్టీ ప్రచారానికీ ప్రజలు పెద్దగా స్పందించడం లేదు. ఎవరి పని వాళ్లు చేసుకొని పోతున్నారు. అసలు ఎన్నికలు జరుగుతున్నాయా? అన్నట్టే ఉంది. ఏ పార్టీ గెలిచే అవకాశాలున్నాయి? అన్న ప్రశ్నే ఉత్పన్నం కావడం లేదు. సామాన్యుల్లో చర్చ కూడా పెద్దగా కనిపించడం లేదు.

ప్రచారం కోసం చాలా మందే పార్టీల లీడర్లతో కలిసి కండువాలు వేసుకొని, జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. కానీ, జై కొడుతున్నవారు పదుల సంఖ్యలోనే ఉండడం గమనార్హం. మిగతావాళ్లంతా వచ్చాం అంటే వచ్చాం అన్నట్లు ఉంటున్నారు. ఈ పరిస్థితి ముందే పసిగట్టిన లీడర్లు స్లోగన్లు, జై కొట్టుడు నినాదాలను రికార్డు చేసుకొని ప్రచారానికి వస్తున్నారు. ప్రచారంలో అంతటా రికార్డింగ్ స్లోగన్ల మోతే. కార్యకర్తలు కూడా ఎవరూ ఆవేశంతో ఊగిపోతున్న సందర్భాలు కనిపించడం లేదు. ఒకప్పుడు ఒక పార్టీ కార్యకర్త అంటే బట్టలు చింపుకొనేవారు. ఇప్పుడు అసలు అలాంటి సన్నివేశాలే కనిపించడం లేదు. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వక దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. అవి చిన్నాచితక పనులే తప్ప, ఎలక్షన్లకు కావాల్సింత ఊపు తెచ్చేవైతే కాదు.

ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే ప్రజలు ఈపాటికే ఓ క్లారిటీకి వచ్చారా? అన్న అనుమానం కలుగుతోంది. గుంభనంగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఈ టైంలో ఎన్నికల సర్వేలు నిర్వహించే సంస్థలు ప్రజల నాడి పట్టుకొనేందుకు ట్రై చేస్తున్నా పట్టుకోలేకపోతున్నాయి. సాధారణంగా సముద్రంలో తుఫాను వచ్చేముందు నిశ్శబ్ద వాతావరణం ఆవరిస్తుంది. అచ్చం తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నిశ్శబ్ధ ఎన్నికల వాతావరణం ఓటర్లను ఏ పార్టీవైపు తీసుకెళ్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

వెబ్ స్టోరీస్