మాకు కిషన్ రెడ్డి వద్దు.. బండి సంజయ్ కావాలి.. సగటు బీజేపీ కార్యకర్త ఆవేదన

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||బండి సంజయ్ కుమార్||

(అగస్త్య, బీజేపీ కార్యకర్త, హైదరాబాద్)

అది 2018 డిసెంబర్.. అంటే సరిగ్గా ఐదేళ్ల క్రితం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్కటే సీటు. గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలిచారు. ఇక, బీజేపీ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఇక్కడ ఉన్న కాషాయ దళం కూడా బీజేపీ పుంజుకుంటుందా? కేసీఆర్ జమానాలో కమలం వికసించడం సాధ్యమేనా? అని నిట్టూర్చింది. అప్పుడే కరీంనగర్ గడ్డపై ఒక విత్తు మొలకెత్తింది. ఆ మొక్కే.. బండి సంజయ్. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లలో ఆయన కూడా ఉన్నారు. కానీ, ప్రజలు కరీంనగర్ ఎంపీగా బండికి భారీ మెజార్టీ అందించారు. అంతే.. ఇక బీజేపీ ఎక్కడా తిరిగి చూసే అవకాశం రాలేదు. ఆయనతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి బీజేపీకి మళ్లీ ప్రాణం లేచొచ్చినట్లు అయ్యింది.

ఇదే దూకుడుతో 2020 మార్చిలో బండి సంజయ్‌కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. పదవి చేపట్టింది మొదలు తన ఫైర్‌తో లక్షలాది యువతను ఆకట్టుకున్నారు. ప్రజల్లోకి బీజేపీని బలంగా తీసుకెళ్లారు. దుబ్బాక బై ఎలక్షన్ మరో టర్నింగ్ పాయింట్. ఆ నియోజకవర్గంలో బీజేపీ సెన్సేషనల్ విక్టరీ సాధించింది. ఆ గెలుపు రఘునందన్ రావుదే అయినా, బండి సంజయ్ ప్రతిష్ఠను అమాంతం పెంచింది. ఆ రిజల్ట్ ఇచ్చిన బూస్ట్‌తో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన మాట పదునుతో ఓట్లను కొల్లగొట్టారు. కేసీఆర్ లాంటి దిగ్గజ రాజకీయ నేతలకు చెమటలు పట్టించారు.

దూకుడు స్వభావంతో బీజేపీని రాష్ట్రంలో అధికార పార్టీకి అసలైన ప్రత్యర్థిగా నిలిపారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం అంటూ ఆయన తీసుకున్న స్టెప్.. యువతను బాగా ఆకర్షించింది. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా దూసుకుపోతున్న బండి సంజయ్‌ను చూసి అప్పటి అధికార సీఎం కేసీఆర్ సహా కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం, ఇతర పార్టీల్లో ఆందోళన మొదలైంది. అదే దూకుడుతో హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ యువతను ఈటల రాజేందర్ కోసం కష్టపడేలా చేశారు. కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రకటించి సంచలనం రేపినా, బీజేపీని విజయతీరాలవైపు నడిపించడంలో బండి సంజయ్‌ది కీలక పాత్ర. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచినంత పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనవి ట్రాక్ రికార్డులే.

తెలంగాణలోని ఏ పల్లెకు వెళ్లినా, ఏ పిల్లగాడిని టచ్ చేసినా.. జై మోదీ.. జైజై మోదీ, బండి సంజయన్న జిందాబాద్, జై శ్రీరాం, శివాజీ మహరాజ్‌ కీ జై అన్న నినాదాలు హోరెత్తాయి. అంత గొప్పగా పార్టీని నడిపించారు బండి సంజయ్. మోదీ, అమిత్ షా, నడ్డా సహకారంతో బీజేపీని రాష్ట్రంలో దీటైన ప్రతిపక్షంగా తయారుచేశారు. కానీ, ఉన్నట్టుండి.. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నిజమా? కాదా? అనుకునేలోపే బండి సంజయ్ పదవి పోయింది. ఆ సీట్లోకి పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. సరిగ్గా ఎన్నికల ముందు కిషన్ రెడ్డికి పదవీ బాధ్యతలు అప్పగించడం బీజేపీ శ్రేణులకు అస్సలు రుచించలేదు. కానీ, పార్టీ అధిష్ఠానం ఏదో మంచి లక్ష్యంతోనే ఈ పనిచేస్తోందని భావిస్తూ వచ్చారు. తీరా చూస్తే 8 సీట్లకు పరిమితమై చతికిలపడింది. అధికారం కోసం బీఆర్ఎస్‌తో పోటీపడే స్థాయి నుంచి సింగిల్ డిజిట్‌కు పడిపోయింది.

బండి సంజయ్ కన్నా కిషన్ రెడ్డి ఎందులో గొప్ప.. అంటే వయసులో గొప్ప. అనుభవంలో గొప్ప. పార్టీలో సీనియర్. కానీ.. పార్టీని గెలిపించే సత్తా లేకపోతే ఈ వయసు ఎందుకు? అనుభవం ఎందుకు? సీనియర్ అయితే ఏంటి? అనే ప్రశ్నలు నాతో పాటు రాష్ట్రంలోని ప్రతి బీజేపీ కార్యకర్త మదిలో తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం కిషన్ రెడ్డి చెప్తారా? లేక అధిష్ఠానం చెప్తుందా? ఇన్ని రోజులు పార్టీ గెలవాలి, మన అస్తిత్వం నిలవాలన్న ఉద్దేశంతో పార్టీ పెద్దలు ఏం చేసినా మౌనంగా ఉన్నాం. కష్టపడ్డదానికి ఫలితం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. అయినా సరే తట్టుకున్నాం. ఇక ముందున్నది లోక్‌సభ ఎన్నికలే. ఎలాగూ మోదీ హవా ఉంది కదా! గెలిచేస్తాం, పొడిచేస్తాం అంటే కష్టం. మోదీ హవాను ప్రతి గుండెకు చేర్చే సైనికుడు కావాలి.. సైన్యాధ్యక్షుడు కావాలి.. కాషాయ దళాన్ని నడిపించే బండి కావాలి. అంటే.. బండి సంజయ్ రావాలి. బీజేపీ గెలవాలి. ఓ పార్టీ పెద్దలారా! మాకు కిషన్ రెడ్డి వద్దు. బీజేపీకి పునర్వైభవం తెచ్చే బండి సంజయే కావాలి. మా ఆవేదన మీకు చేరితే మనం గెలుస్తాం. లేకపోతే ఎన్నికల సమరాంగణంలో మళ్లీ అచేతనంగా నిలబడతాం. ఆలోచించాల్సింది మీరే. ఇక నిర్ణయం మీ చేతుల్లోనే.

బండిని సారథిగా తెచ్చుకుందాం..

బీజేపీ పరువు నిలుపుకుందాం..

వెబ్ స్టోరీస్