||బొగ్గారపు బ్రహ్మానందం||
(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని విశ్వజనని ఫౌండేషన్ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధనకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామని అధ్యక్షుడు బొగ్గారపు బ్రహ్మానందం తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ కాళహస్తిలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అంగరంగ వైభవంగా కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ వేడుకలకు అందరినీ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించే ఈ నెలలో చేసే పూజలకు, వ్రతాలకు విశేషమైన ఫలితం ఉంటుందని అందులో భాగంగానే ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించి, కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం కాళహస్తి చైర్మన్ జులగంటి మురళీమోహన్ గుప్తా, చింతా పుల్లారావు, బత్తుల మురళీధర్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా సమావేశంలో విశ్వజనని ఫౌండేషన్ ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి కాకుమాను సత్యనారాయణ, కోశాధికారి గుండా సీతారామాంజనేయులు (అంజి), ప్రోగ్రాం కోఆర్డినేటర్లు డాక్టర్ గాయత్రి సురేష్ రెడ్డి మురళీకృష్ణ పాల్గొన్నారు.