ఉత్తరప్రదేశ్లో ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను చంపేందుకు పెద్ద స్కెచ్చే వేసింది. చంపడమే కాదు.. తప్పించుకునేందుకు కూడా గొప్ప పథకాన్ని రచించింది.
పోలీసుల అదుపులో రవిత
లక్నో : వివాహేతర సంబంధాల మోజులో పడి భర్తను భార్య.. భార్యను భర్త చంపుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో కూడా అలాంటి ఘటనే జరిగింది. ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను చంపేందుకు పెద్ద స్కెచ్చే వేసింది. చంపడమే కాదు.. తప్పించుకునేందుకు కూడా గొప్ప పథకాన్ని రచించింది. అయితే, పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడే సరికి నిజం కక్కింది. వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన అమిత్ కశ్యప్ (25)కు భార్య రవితో పెళ్లైంది. అమిత్ స్నేహితుడు అమర్దీప్కు, రవితకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన అమిత్.. అమర్దీప్, రవితతో గొడవపడ్డాడు. దీంతో ఎలాగైనా అమిత్ అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు.
రాత్రి పడుకున్న తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిపించిన రవిత.. భర్తను గొంతు నులిమి చంపేసింది. అప్పటికే పథకం ప్రకారం రూ1000 పెట్టి కొనుక్కొచ్చిన పామును శవం పక్కన వేశారు. ఉదయం లేచి.. పాము కాటు వేసిందని, దాంతో తన భర్త చనిపోయాడని ఏడుస్తూ అందరినీ నమ్మించింది. అయితే.. పోలీసులు ఎంటర్ కావడంతో సీన్ మారిపోయింది. అనుమానం వచ్చి పోస్టుమార్టంకు పంపించారు. పోస్టుమార్టంలో గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు గుర్తించారు. పోలీసులు అమర్దీప్, రవితను తమదైన శైలిలో విచారించగా నిజాన్ని వెల్లడించారు. వారిద్దరి అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.