||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, క్రైం న్యూస్: ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ను హత్య చేశాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ ఘటన జరిగింది. హసన్ జిల్లాకు చెందిన హేమంత్ దత్తా తన వద్ద డబ్బులు లేకపోయినా ఆన్లైన్లో రూ.46 వేలకు ఐఫోన్ బుక్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 7న ఈ-కార్ట్ డెలివరీ బాయ్ ఫోన్ తీసుకొని వచ్చి హేమంత్కు ఇచ్చాడు. సెల్ఫోన్ డబ్బాను తెరిచి చూపించాలని అడిగితే, డబ్బులు ఇచ్చాకే ఫోన్ డెలివరీ చేస్తానని డెలివరీ బాయ్ చెప్పాడు. తన వద్ద డబ్బులు లేవని, కాసేపు ఇంట్లో కూర్చుంటే తీసుకొస్తానని చెప్పాడు.
సరేనని చెప్పి ఇంట్లోకి వెళ్లి కూర్చున్న డెలివరీ బాయ్ని హేమంత్ కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంట్లోనే బాత్రూంలో నాలుగు రోజులు దాచిపెట్టాడు. వాసన రావడంతో గోనెసంచిలో దాచి, బైక్పై రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. నాలుగు రోజులైనా కనిపించకపోవడంతో డెలివరీ బాయ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా హేమంత్ దత్తాను అరెస్టు చేశారు. మృతదేహాన్ని బైక్పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో కన్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు.