తిరుమల వెంకన్న (Tirumala) వైకుంఠ ద్వార టోకెన్ల (Vaikunta Dwara darshanam) జారీ సందర్భంగా తిరుపతిలో ఘోర విషాదం జరిగింది. టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు రావడంతో తీవ్ర తోపులాట (Stampade) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు.
తిరుపతిలో తొక్కిసలాట
- మృతుల్లో ఐదుగురు మహిళలు
- వైకుంఠ ద్వార దర్శన టికెట్లలో అపశృతి
- చికిత్స పొందుతున్న మరో 29 మంది
- టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యం బట్టబయలు
- బీఆర్ నాయుడు రాజీనామాకు డిమాండ్లు
తిరుపతి, ఈవార్తలు : తిరుమల వెంకన్న (Tirumala) వైకుంఠ ద్వార టోకెన్ల (Vaikunta Dwara darshanam) జారీ సందర్భంగా తిరుపతిలో ఘోర విషాదం జరిగింది. టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు రావడంతో తీవ్ర తోపులాట (Stampade) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్ల్లో తిరుపతిలోని ఆసుపత్రులకు తరలించారు. రుయా ఆసుపత్రిలో 20 మంది, స్విమ్స్లో 9 మంది చికిత్స పొందుతున్నారు. రుయా ఆసుపత్రిలో కలెక్టర్ వెంకటేశ్వర్, తితిదే ఈవో శ్యామలరావు చేరుకొని వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.
ఘటన జరిగిందిలా..: తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే, టోకెన్ల కోసం ఇవాళ సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. టికెట్ల కోసం లైన్ కట్టిన భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడికక్కడే ఓ మహిళ చనిపోగా, మిగతావారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
తొక్కిసలాటకు కారణమిదే..: టోకెన్ల కోసం వచ్చిన భక్తులు రోడ్లపై గుమిగూడకుండా బైరాగిపట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో ఉంచారు. అయితే, టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థత గురికావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు క్యూలైన్ తెరిచారు. టోకెన్ల జారీ చేసేందుకు క్యూలైన్ ఓపెన్ చేశారని భావించిన భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్యూలైన్ల వద్ద సరైన భద్రత ఏర్పాటు చేయలేదని మరి కొందరు ఆరోపించారు. పాలక మండలి సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.