జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు చేపట్టగా దారుణం వెలుగు చూసింది. పట్టణంలోని పబ్ రెస్టారెంట్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. కుళ్లిన రొయ్యలు, పురుగులతో కూడిన మాంసం బయటపడింది.
కుళ్లిన రొయ్యలు, చేపలు
జగిత్యాల, ఈవార్తలు : ఆకలితో రెస్టారెంట్కు వెళ్తున్నారా.. ఫ్యామిలీతో సరదాగా బయట తినొద్దామని వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త. ఆకలితోనో, సరదాగా తినివద్దామనుకుంటే.. అది మీ ప్రాణాలకే ముప్పు తేవొచ్చు. ఎందుకంటే.. రెస్టారెంట్లలో నిల్వ చేస్తున్న మాంసం చూస్తుంటే వాంతులు వచ్చేలా ఉన్నాయి. తాజాగా, జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు చేపట్టగా దారుణం వెలుగు చూసింది. పట్టణంలోని పబ్ రెస్టారెంట్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. కుళ్లిన రొయ్యలు, పురుగులతో కూడిన మాంసం బయటపడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు.. వివరణ ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలు హోటల్లు, రెస్టారెంట్లలో అధికారులు చేపడుతున్న తనిఖీల్లో విస్తు గొలిపే విషయలు తెలుస్తున్నాయి. పేరు మోసిన రెస్టారెంట్లలోనూ కుళ్లిన మాంసం.. చాలా రోజులుగా నిల్వ చేసిన మాంసం బయటపడుతోంది. వీటిని తిని ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు ఇంటి ఆహారమే తీసుకోవడం బెటర్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకలి వేస్తే పళ్లు, పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం అని సలహా ఇస్తున్నారు. ఏదైనా హోటళ్లలో తినాలనుకుంటే కిచెన్ పరిశుభ్రంగా ఉందా? లేదా? అన్నది పరిశీలించుకోవాలని చెప్తున్నారు.