విద్యుత్తు బిల్లు వెరిఫికేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ వనం రఘు అనే వ్యక్తికి ఇలాగే ఫోన్ చేసి, అతడి ఖాతా నుంచి రూ.5 లక్షలు కాజేశారు.
ప్రతీకాత్మక చిత్రం
మంచిర్యాల, ఈవార్తలు : విద్యుత్తు బిల్లు వెరిఫికేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన ఎల్ఐసీ ఏజెంట్ వనం రఘు అనే వ్యక్తికి ఇలాగే ఫోన్ చేసి, అతడి ఖాతా నుంచి రూ.5 లక్షలు కాజేశారు. వివరాల్లోకెళితే.. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ (TGNPDCL) పేరుతో అతడి మొబైల్కు ఒక లింక్ మెసేజ్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక OTP వచ్చింది. వెంటనే సైబర్ నేరగాడు రఘుకు కాల్ చేసి తాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని.. ఎలక్ట్రిసిటీ బిల్లు verify చేస్తున్నామని.. ఓటీపీ చెప్పాలని అడిగాడు. నిజమేకావొచ్చని అనుకున్న రఘు.. ఓటీపీ చెప్పగానే, బ్యాంక్ ఖాతా నుంచి రూ.5,23,000 సైబర్ నేరగాడి ఖాతాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మోసపోయానని గ్రహించిన రఘు.. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘటనపై స్పందించిన మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్..
సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని, కొత్త టెక్నాలజీలు ఉపయోగించి సైబర్ నేరాలు చేస్తున్నారని తెలిపారు. అపరిచిత వ్యక్తులు పంపే మెసేజ్లకు స్పందించవద్దని, లింక్లు అస్సలు ఓపెన్ చేయవద్దని అన్నారు. బ్యాంకులు, ఇతర శాఖలేవీ ఓటీపీ కోసం ఫోన్ చేయబోరని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల దాడులకు ఎంతోమంది చదువుకున్న వాళ్లు కూడా మోసపోయారని, కాబట్టి వాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని సూచించారు.