||చైన్ స్నాచర్లు ఆధారం: సీసీటీవీ ఫుటేజ్||
ఈవార్తలు, హైదరాబాద్ క్రైం : కొంతకాలంగా చడీచప్పుడు లేకుండా సైలెంట్గా ఉన్న చైన్ స్నాచర్లు.. ఒకేసారి రెచ్చిపోయారు. కేవలం రెండే రెండు గంటల్లో ఆరు చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. హైదరాబాద్లోనే ఈ ఆరు ఘటనలు జరగడం గమనార్హం. ఉదయం నిద్ర లేవగానే హైదరాబాద్ వాసులకు ఈ ఘటనలకు షాకింగ్కు గురిచేశాయి. ఉదయం 6:20 గంటల నుంచి 8:10 గంటల మధ్య రెండు గంటల వ్యవధిలోనే హైదరాబాద్లోని ఉప్పల్, కల్యాణపురి, ఓయూలోని రవీంద్రనగర్, నాచారం నాగేంద్రనగర్, చిలకలగూడ, రామ్గోపాల్పేట రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో మహిళల మెడల్లోంచి చైన్లు లాక్కెళ్లారు. ముందుగా ఉప్పల్లో చైన్ స్నాచింగ్ మొదలుపెట్టిన దొంగలు రామ్గోపాల్పేట వరకు వరుసగా దొంగతనాలకు పాల్పడ్డాడు.
ఈ దొంగలు ఢిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ ముఠా రైల్లో ఢిల్లీకి పారిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని రైల్వే స్టేషన్ల వద్ద నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. అనుమానం వచ్చినవాళ్లను తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. వాహనాలను కూడా ఎక్కడికక్కడ తనిఖీ చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్లో దొంగతనానికి పాల్పడిన ముఠా.. వాళ్లు ఉపయోగించిన బైక్ను ప్యారడైస్ వద్ద వదిలి వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. రాంగోపాల్పేట పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉంటే పోలీసులకు చెప్పాలని కోరారు.