శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో కొలువైన హనుమాన్ దేవాలయంలో విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలోని నవగ్రహాలను ధ్వంసం చేశారు.
శంషాబాద్, ఈవార్తలు : తెలంగాణలో ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆకతాయిలు పెట్రేగిపోయి పలు గుడులపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో కొలువైన హనుమాన్ దేవాలయంలో విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయంలోని నవగ్రహాలను ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయాన్నే ఆలయానికి వచ్చిన పూజారి నవగ్రహాల ధ్వంసాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ ప్రజలు భారీ స్థాయిలో ఆలయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు.
కాగా, విగ్రహాల ధ్వంసంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం జరుగుతోందని.. ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీస్తున్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఘటన మొదలుకొని.. వరుస ఘటనలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలం అయ్యాయని, సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మాని.. పాలనపై ఫోకస్ పెట్టాలని, వెంటనే దాడి బాధ్యులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.