||కళాతపస్వీ కే విశ్వనాథ్, Photo: Twitter ||
ఈవార్తలు, సినిమా న్యూస్: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఈ మధ్యే రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోగా, తాజాగా లెజెండరీ డైరెక్టర్, కళాతపస్వీ కే విశ్వనాథ్ కన్నుమూశారు. 92 ఏళ్ల వయసున్న ఆయన గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల పాటు ఎన్నో మరపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన కే విశ్వనాథ్.. శంకరాభరణం సినిమా విడుదలైన ఫిబ్రవరి 2 (1980వ సంవత్సరం)నే ఆయన అస్తమించటం గమనార్హం. ఈ చిత్రం తర్వాతే కే విశ్వనాథ్.. కళాతపస్వీగా పేరు గడించారు.
వ్యక్తిగత వివరాలు:
జననం: 1930 ఫిబ్రవరి 19
స్వస్థలం: గుంటూరు జిల్లా రేపల్లె మండంలోని పెద పులివర్రు
తల్లిదండ్రులు: కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ
సంతానం: ఇద్దరు కుమారులు, ఒక కూతురు
వృత్తి జీవితం:
- చెన్నైలోని ఒక స్టూడియో సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించారు.
- ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు.
- మొత్తం 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో 9 బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి.
అవార్డులు:
పద్మశ్రీ పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (2016)
రఘుపతి వెంకయ్య పురస్కారం (1992)
స్వాతిముత్యం - 59వ ప్రఖ్యాత ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది.
ఆసియా ఫసిపిక్ చలన చిత్ర వేడుకల్లో.. స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి.
మాస్కోలో జరిగిన చలన చిత్ర వేడుకల్లో.. స్వయంకృషి సినిమా ప్రదర్శితమైంది.
ప్రాంతీయ విభాగంలో స్వరాభిషేకం చిత్రానికి జాతీయ పురస్కారం లభించింది.