తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన యోధుల కథతో తెరకెక్కించిన చిత్రం రజాకార్ను కచ్చితంగా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. నిజాం పాలనలో రజాకార్ల దురాగతాలను అణచివేసి హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసేందుకు సర్ధార్ వల్లభభాయ్ చేసిన ప్రయత్నాలను ఈ సినిమాలో చూపించారని తెలిపారు.
రజాకార్ సినిమాపై బండి సంజయ్ కామెంట్స్
తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన యోధుల కథతో తెరకెక్కించిన చిత్రం రజాకార్ను కచ్చితంగా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. నిజాం పాలనలో రజాకార్ల దురాగతాలను అణచివేసి హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేసేందుకు సర్ధార్ వల్లభభాయ్ చేసిన ప్రయత్నాలను ఈ సినిమాలో చూపించారని, ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోందని వెల్లడించారు. గత ఏడాది మార్చి 15న థియేటర్లలో విడుదలన ఈ సినిమా మోస్తరుగా ఆడింది. విడుదల సమయంలో ఈ సినిమా పలు వివాదాలను ఎదుర్కొన్నది. కొన్ని పార్టీలు రజాకార్ సినిమాకు అనుకూలంగా మాట్లాడగా, ఇంకొన్ని పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడాయి.
దాదాపు 9 నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో.. ఈ సినిమా చూడాలని బండి సూచించారు. ‘కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని, మన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఇది. రజాకార్ల దురాగతాలను ఎదురించడానికి ప్రజలే సాయుధులై కదన రంగంలో దిగిన యదార్థ కథ ఇది. చరిత్ర పుటల్లో దాగిన ఈ నెత్తురు జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా రజాకార్. నిజాం హయాంలో జరిగిన మారణ హోమాన్ని, హిందువులపై జరిగిన దౌర్జన్యాలను, బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు ప్రజలే సాయుధులై ఎలా పోరాటం చేశారో ఈ రజాకార్ సినిమాలో చూపించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆర్థిక నష్టాలు ఎదురైనా భయపడకుండా గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన గొప్ప సినిమా. శుక్రవారం నుంచి ఆహాలో ప్రసారం అవుతోంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నా. ముఖ్యంగా ప్రతి హిందువు తప్పకుండా ఈ మూవీ చూడాలి’ అని పేర్కొన్నారు.