ముకేశ్ అంబానీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేనంత పెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. గుజరాత్లోని జామ్ నగర్లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ముంబై, ఈవార్తలు : రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఏది చేసినా సంచలనమే. జియోతో దేశంలో సరికొత్త విప్లవాన్ని సృష్టించారు. తొలి ఏడాది దేశ ప్రజలందరికీ ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్, ఫ్రీ మెసేజ్ సదుపాయం కల్పించి.. ఇప్పుడు టెలికం రంగాన్ని శాసిస్తున్నారు. దేశంలోనే సంపన్నుల్లో నంబర్ వన్ అయిన ఆయన.. దేశ ప్రజలకు తక్కువ ధరకే డేటాను అందిస్తున్నారు. అయితే.. ముకేశ్ అంబానీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేనంత పెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. గుజరాత్లోని జామ్ నగర్లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్.. ఎన్విడియా నుంచి అధునాతన ఏఐ చిప్లను కొనుగోలు చేయనుంది. ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్స్ సామర్థ్యంతో ఏర్పాటు కావచ్చని అంచనాలు ఉన్నాయి. మైక్రోసాప్ట్, అమెజాన్, గూగుల్.. ఏఐ సేవల కోసం డేటా సెంటర్ సామర్థ్యాలను విస్తరించాలని చూస్తున్నాయి. దీని కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఓపెన్ ఏఐ, సాప్ట్ బ్యాంక్, ఒరాకిల్ కూడా ఓ భారీ ప్రాజెక్టుకు సిద్ధమయ్యాయి. స్టార్గేట్ ప్రాజెక్ట్ కోసం 500 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే ప్రణాళికలను కూడా ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అంబానీ చూస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది పూర్తయితే భారత్ సామర్థ్యాలు పెరుగుతాయి. దేశంలో మొత్తం సామర్థ్యం గిగావాట్ కంటే తక్కువే ఉంది. కొత్త ప్రాజెక్ట్తో ఇది మూడిరతలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది దేశానికి ప్రధాన మైలురాయి అవుతుంది. ఇదివరకే.. భారత్లోని ప్రతి ఒక్కరికి ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని అంబానీ ప్రకటించారు. ఇప్పుడు డేటా సెంటర్ ఏర్పాటుకు ముందడుగు వేస్తుండటం దేశ చరిత్రలో కీలకంగా మారుతుంది.