ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం కారణంగా కొంత వెసులబాటు కలుగుతోంది. అయితే ఇది మరింతగా ఆదుకునేలా ఉండాలి. వడ్డీరేట్లు ప్రజలకు, వ్యాపారులకు, ఉద్యోగులకు అనువుగా ఉండాలి. వారు భరించేవిగా ఉండాలి.
ప్రతీకాత్మక చిత్రం
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం కారణంగా కొంత వెసులబాటు కలుగుతోంది. అయితే ఇది మరింతగా ఆదుకునేలా ఉండాలి. వడ్డీరేట్లు ప్రజలకు, వ్యాపారులకు, ఉద్యోగులకు అనువుగా ఉండాలి. వారు భరించేవిగా ఉండాలి. పన్నులు కూడా హేతుబద్దంగా ఉండాలి. విపరీతంగా పన్నులు, వడ్డీలు వసూలు చేస్తే ప్రజలు భరించలేరని గుర్తించాలి. స్వయం ఉపాధి పొందే వారికి,చవువుకునే వారికి ఉపయుక్తంగా ఉండాలి. డబ్బు వినిమయం, వస్తు కొనుగోళ్లకు అవినాభావ సంబంధం ఉంది. డబ్బు మార్కెట్లో చలామణి అవుతూనే వస్తూత్పత్తి అన్నది ప్రజలకు చేరాలి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగేలా పరపతి విధానం ఉండాలి. అది ఇల్లు కావు, ఇతర పదార్థాలు కావచ్చు. అలాగే పెట్రో ధరలు, గ్యాస్ ధరలు కూడా ప్రజల కొనుగోలు శక్తికి మించి ఉండరాదు. ఇవి వస్తువుల ధరలు కూడా నియంత్రిస్తుంటాయి. వీటి ధరల ఆధారంగానే మార్కెట్లో వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇవి బ్యాలెన్స్ చేయడం అన్నది ప్రభుత్వం నడిపిస్తున్న వారికి అవసరం. అదేపనిగా ఉచిత పథకాల కారణంగా సమాజంలో పనిచేసే వారు తగ్గిపోతున్నారు. తినికూర్చునే వారు పెరుగుతున్నారు. దీంతో వస్తూత్పత్తి కూడా తగ్గుతుంది. ఇది కూడా గమనించాల్సి ఉంది. ఇకపోతే ధర పెరిగినంత మాత్రాన పెట్రోలు, డీజెల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించలేం. కాబట్టి వాటికోసం మనం వెచ్చించే మొత్తం పెరిగింది. ఐతే కార్మికుల, ఉద్యోగుల వేతనాలు మొత్తం మాత్రం పెరగడంలేదు. దీంతో మనం ఇతర వస్తువుల వినియోగాన్ని తగ్గించివేస్తున్నాం. ఇతర సరుకుల వినియోగం ఎప్పుడైతే తగ్గిందో, ఆ మేరకు ఆయా రంగాలలో మాంద్యం ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
కాని అలా జరగడం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి నప్పుడల్లా వాటివిూద వసూలు చేసే పన్నుల మొత్తం కూడా పెరుగుతోంది. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించాలంటే ప్రజల కొనుగోలుశక్తిని పెంచే మార్గాలు అన్వేషించాలి. ఉపాధికల్పన మార్గాలను అన్వేషించాలి. కనీసం పెట్రో ఉత్పత్తుల విూద పన్నులను పెంచడం తగ్గిస్తే ప్రజల కొనుగోలుశక్తి పెరుగుతుంది. అప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రో ధరల పెరుగుదల వలన అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆవిధంగా వచ్చిన అదనపు ఆదాయాన్ని ఉపాధి కల్పన వంటి రంగాలకు ఖర్చు చేయడం బదులు, కార్పొరేట్లకు మరిన్ని రాయితీల్విడానికో, వారి బకాయిలను మాఫీ చేయడానికో వినియోగిస్తోంది. అలాగే మరిన్ని ఉచిత పథకాలకు వెచ్చిస్తున్నారు. వాస్తవానికి మన దేశంలో పెట్రోలు ధరలో 45.5 శాతం, డీజిల్ ధరలో 39.8 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులకే పోతుంది. పన్ను రూపంలో వసూలు చేసేదానిలో కేంద్రం రాష్ట్రాలతో భాగం పంచుకోవాలి. మోదీ ప్రభుత్వం నేరుగా పన్ను రూపంలో కాకుండా స్పెషల్ డ్యూటీ, రోడ్ సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ వంటి పేర్లతో వసూలు చేస్తోంది. తరచూ ఆర్ధిక మాంద్యం ఏర్పడడం వల్ల సరుకుల వినిమయం తగ్గిపోతుంది. అదే విధంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ వుంటుంది. మన రూపాయి విలువ పడిపోయినా, సరుకుల ధరలు పెరిగినా అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.
దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 8 శాతం దాటింది. వీటికి తోడు మన దేశ వార్షిక జిడిపి వృద్ధి రేటు ముందు అంచనా వేసినట్టుగా ఉండడం లేదని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ట్రంప్ విధానాలు, పాలస్తీనా, ఉక్రెయిన్ యుద్ధం ఆర్ధిక వ్యవస్థ విూద ప్రభావం చూపనున్నాయని అంటున్నారు. వృద్ధిరేటు తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం, నిరుద్యోగం తీవ్రంగా ఉండడం నేటి ఆర్థి దుస్థితికి తాజా ఉదాహరణాలు. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. ఐతే మార్కెట్లవిూద గుత్తాధిపత్యం కలిగివున్న బడా కార్పొరేట్లు ఆ పెరిగిన ధరలను వినియోగదారుల విూదకు నెట్టివేస్తున్నారు. ఇకపోతే పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వలన దాని ప్రభావం రవాణా రంగం విూద పడుతుంది. దాని కారణంగా ఇతర సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిసి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీని పర్యవసానంగా శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి తగ్గిపోతుంది. దానివలన సరుకుల వినియోగం తగ్గిపోతుంది. మార్కెట్ లోని సరుకులు చెల్లుబాటు కావు. అందువలన ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుంది. ఇకపోతే మనదగ్గర పంటలు బాగానే పండుతున్నాయి. మిర్చి, పప్పు ధాన్యాలు విపరీతంగా పండుతున్నాయి. వరి లెక్కకు మించి పండిస్తున్నారు. అయితే ఈ ధరలు ప్రజలకు చేరడం లేదు.
తాజాగా ఆక్వా రైతులు ట్రంప్ దెబ్బకు విలవిల్లాడుతున్నారు. చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఆక్వా సామాన్యులకు అందుబాటు లోకి లేదు. దానిని ప్రజల చెంతకు తీసుకుని వెళ్లాల్సి ఉంది. ప్రజలకు మనదేశంలో లభిస్తున్న ఆహార ఉత్పత్తులు సరసమైన ధరలకు చేరాలి. ప్రధానంగా రొయ్యలను ఇంటింటికీ చేరుకునేలా చేయాలి. 140 కోట్లు జనాభా ఉన్న మనదేశంలో మాంసాహారులు కూడా ఎక్కువే. అమెరికా సుంకాలకు భయపడి కూర్చోకుండా ఆక్వాను ప్రజలకు అందించేలా ప్రణాళికలు చేయాలి. ఇకపోతే ట్రంప్ సుంకాలను విమర్శిస్తున్న మనం.. మన వద్ద మోదీ సుంకాలను పట్టించుకోవడం లేదు. దేశం ఆర్థికంగా నిలదొక్కుకుని ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే జిఎస్టీ వడ్డింపులు భారీగా తగ్గాలి. ఉచిత పథకాలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టాలి. తాయిలాలను పక్కన పెట్టాలి. కిలో రూపాయికే బియ్యం పథకానికి పాతరేయాలి. వడ్డీరేట్లు మరింతగా తగ్గాలి. విద్యార్థులు తీసుకునే విద్యారుణాలపై వడ్డీ నామమాత్రంగా ఉండేలా చూడాలి. ఇలా ఆలోచన చేసినప్పుడే, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. సంపాదించింది తిండికి కూడా సరిపోకపోతే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పాలకులు, వారికి సలహాలు ఇస్తున్న మేధావులు గుర్తించాలి.