పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ కీలక ఆటగాళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మినహా 12 మంది జాతీయ కాంట్రాక్ట్ ఆటగాళ్లు విదేశీ టీ20 లీగ్లలో పాల్గొనేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ కీలక ఆటగాళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మినహా 12 మంది జాతీయ కాంట్రాక్ట్ ఆటగాళ్లు విదేశీ టీ20 లీగ్లలో పాల్గొనేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్, జనవరి నెలల్లో జరగనున్న మూడు ప్రధాన లీగ్లలో పాక్ ఆటగాళ్లు సందడి చేయనున్నారు. అయితే, పొట్టి ఫార్మాట్లో అంతగా ఆకట్టుకోలేకపోతున్న సల్మాన్కు ఏ లీగ్లోనూ అవకాశం దక్కకపోవడం గమనార్హం. పాక్ స్టార్ ఆటగాళ్లు బాబర్ అజామ్, షహీన్ అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్ ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో అరంగేట్రం చేయనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో దాదాపు 11 మంది పాక్ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. ఫఖర్ జమాన్, నసీమ్ షా వంటి వారు యూఏఈకి చెందిన ఐఎల్టీ20 లీగ్లో ఆడనున్నారు. అయితే, దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో మాత్రం పాక్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ లీగ్లోని చాలా జట్ల యాజమాన్య హక్కులు ఐపీఎల్ ఫ్రాంచైజీల వద్ద ఉండటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ లీగ్లు జరుగుతున్న సమయంలోనే పాకిస్థాన్ జట్టు శ్రీలంక, ఆస్ట్రేలియాలతో టీ20 సిరీస్లు ఆడాల్సి ఉంది. జనవరి 30 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్ ప్రారంభం కానుండటంతో చాలామంది ఆటగాళ్లు తమ లీగ్ ఒప్పందాలను మధ్యలోనే ముగించుకుని జాతీయ జట్టుతో చేరాల్సి ఉంటుంది. అయితే, బీబీఎల్ యాజమాన్యానికి మాత్రం టోర్నీ మొత్తం తమ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని పీసీబీ హామీ ఇచ్చినట్లు సమాచారం.