అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బుధవారం నాటి ఫారెక్స్ ట్రేడింగ్లో రూపాయి విలువ తొలిసారిగా 90 మార్క్ను దాటి సరికొత్త ఆల్టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
డాలర్తో పోలిస్తే భారీగా పతనం
చరిత్రలో మొదటిసారి 90 మార్కు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బుధవారం నాటి ఫారెక్స్ ట్రేడింగ్లో రూపాయి విలువ తొలిసారిగా 90 మార్క్ను దాటి సరికొత్త ఆల్టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇది దేశీయ కరెన్సీ చరిత్రలో ఒక కీలక పరిణామంగా నిలిచింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 89.96 వద్ద స్థిరపడిన రూపాయి, బుధవారం ఉదయం సెషన్ ప్రారంభమైనప్పటి నుంచే బలహీనంగా కదలాడింది. అమ్మకాల ఒత్తిడితో క్రమంగా క్షీణిస్తూ వచ్చిన రూపాయి విలువ, ఒక దశలో 90.14 వద్ద చారిత్రక కనిష్ఠాన్ని తాకింది.
ఆందోళన వద్దు: సీఈఏ
భారత కరెన్సీ రూపాయి పతనంపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వచ్చే ఏడాది పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. రూపాయి విలువ 90 రూపాయల మార్కును దాటినప్పటికీ ప్రభుత్వం ఆందోళన చెందడం లేదని, దీనివల్ల ద్రవ్యోల్బణం లేదా ఎగుమతులపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఎడ్జ్ సమ్మిట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు