ఏ నిధులూ సేకరించట్లే... ఆ వార్తలన్నీ అబద్ధం... ఎలాన్ మస్క్ క్లారిటీ...

టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తన అంతరిక్ష సంస్థపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. స్పేస్‌ఎక్స్ 800 బిలియన్ డాలర్ల విలువతో నిధులు సమీకరిస్తోందని, అలాగే నాసా నుంచి సబ్సిడీలు పొందుతోందని వచ్చిన కథనాల్లో ఏమాత్రం నిజం లేదని ఆదివారం స్పష్టం చేశారు.

elonmusk

ఎలాన్ మస్క్

న్యూయార్క్: టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తన అంతరిక్ష సంస్థపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. స్పేస్‌ఎక్స్ 800 బిలియన్ డాలర్ల విలువతో నిధులు సమీకరిస్తోందని, అలాగే నాసా నుంచి సబ్సిడీలు పొందుతోందని వచ్చిన కథనాల్లో ఏమాత్రం నిజం లేదని ఆదివారం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో వరుస పోస్టులు చేశారు. స్పేస్‌ఎక్స్ 800 బిలియన్ డాలర్ల భారీ విలువతో సెకండరీ షేర్ల అమ్మకానికి సిద్ధమవుతోందని ఇటీవల 'వాల్‌స్ట్రీట్ జర్నల్' ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తలపై మస్క్ స్పందిస్తూ, "స్పేస్‌ఎక్స్ 800 బిలియన్ డాలర్ల నిధులు సమీకరిస్తోందని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజం కాదు. మా కంపెనీ చాలా ఏళ్లుగా లాభాల్లో ఉంది. ఉద్యోగులు, ఇన్వెస్టర్లకు నగదు లభ్యత కల్పించేందుకు ఏడాదికి రెండుసార్లు స్టాక్ బైబ్యాక్ చేస్తుంటాం" అని స్ప‌ష్టం చేశారు. నాసా సబ్సిడీల అంశాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. "వచ్చే ఏడాది మా ఆదాయంలో నాసా వాటా 5 శాతం కన్నా తక్కువే ఉంటుంది. మాకు నాసా సబ్సిడీలు ఇస్తోందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. అత్యుత్తమ ఉత్పత్తిని, అతి తక్కువ ధరకు అందించడం వల్లే మేము నాసా కాంట్రాక్టులు గెలుచుకున్నాం. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే విషయంలో నాసా భద్రతా ప్రమాణాలను అందుకున్న ఏకైక సంస్థ ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ మాత్రమే" అని మస్క్ అన్నారు. స్టార్‌షిప్, స్టార్‌లింక్ ప్రాజెక్టులలో సాధిస్తున్న పురోగతి ఆధారంగానే కంపెనీ విలువ పెరుగుతుందని ఆయన తెలిపారు. కాగా, స్పేస్‌ఎక్స్ గత వారం కాలిఫోర్నియా నుంచి 28 స్టార్‌లింక్ శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఫాల్కన్ 9 రాకెట్‌తో ఇది 156వ ప్రయోగం కావడం విశేషం.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్