పార్లమెంటులో డ్రామాలొద్దన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై స్పందించేందుకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరాకరించగా, ఆయన సోదరి, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు.
ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంటులో డ్రామాలొద్దన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై స్పందించేందుకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరాకరించగా, ఆయన సోదరి, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రత్యేక సమగ్ర చట్ట సవరణ (ఎస్ఐఆర్), ఢిల్లీ కాలుష్యం వంటి తీవ్రమైన అంశాలను లేవనెత్తడం డ్రామా ఎలా అవుతుందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఇవి ప్రజాప్రయోజన అంశాలని ఆమె అన్నారు. ఈ అంశాలపై పార్లమెంటులో చర్చిద్దామని, వీటిపై చర్చ లేనప్పుడు ఇక పార్లమెంట్ దేనికని ఆమె ప్రశ్నించారు. ప్రజా సంబంధ అంశాలపై సభలో మాట్లాడటం లేదా లేవనెత్తడం డ్రామా అని అనడం సరికాదని ఆమె అన్నారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన చర్చలకు అనుమతించకపోవడమే డ్రామా అని ఆమె అభివర్ణించారు. కాగా, ఈరోజు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 19వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి.