వందేమాతరం ఒక మంత్రం అని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు దేశ ప్రజలందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చిందని చెప్పారు.
నరేంద్ర మోదీ
స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తి
కానీ దాన్ని ముక్కలు చేశారు
వందేమాతరానికి నెహ్రూ వ్యతిరేకం
లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: వందేమాతరం ఒక మంత్రం అని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు దేశ ప్రజలందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చిందని చెప్పారు. వందేమాతరం గేయాన్ని ఆమోదించి, 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సోమవారం పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. వందేమాతరం గీతం మన స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పాట...త్యాగం ,తపస్సుకు మార్గాన్ని చూపించిందని అన్నారు. ఈ పోరాటం ఏదో ఒక భూమి కోసం మాత్రమే కాదని వందేమాతరం మనకు అర్థమయ్యేలా చేసిందన్నారు. వందేమాతరం మన వేద కాలాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ భూమి నా తల్లి అని, నేను ఈ భూమికి పుత్రుడిని అని చెబుతుంది. వందేమాతరం మాతృభూమికి సంబంధించిన పాట అని ఆయన కొనియాడారు.వందేమాతరం రుణాన్ని సమిష్టిగా అభినందించేందుకే, ఈ పాట కారణంగానే మనమందరం ఇక్కడ ఉన్నాము. వందేమాతరం రుణాన్ని గుర్తించాల్సిన పవిత్ర సందర్భమిది అన్నారు. ‘దేశాన్ని నలుదిక్కులనుంచి ఏకంచేసింది. మళ్ళీ ఐక్యమై అందరితో కలిసి కదలాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పాట మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి మనకు స్ఫూర్తిని ,శక్తినివ్వాలి. 2047 నాటికి మన దేశాన్ని స్వావలంబనగా, అభివృద్ధి చెందేలా చేయాలనే సంకల్పాన్ని మనం పునరుద్ఘాటించాలి. భారత జాతీయ గీతాన్ని 50 సంవత్సరాల క్రితం ప్రతిపక్ష పార్టీ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని అణచివేశారు. దేశభక్తులను జైళ్లలో నెట్టిన ఎమర్జెన్సీ మన దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఇప్పుడు మనకు వందేమాతరం గొప్పతనాన్ని పునరుద్ధరించే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడద’ని తెలిపారు. ముస్లింలకు నచ్చదనే కారణంగా జవహర్లాల్ నెహ్రూ - 'వందేమాతరం'ను వ్యతిరేకించడంలో ముహమ్మద్ అలీ జిన్నాను అనుసరించారని ఆరోపించారు. 1937లో మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ వందేమాతరం గీతానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిందనీ, అయితే దానిని వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూలు వత్తాసు పలికి ఈ గీతం నుంచి కొన్ని పంక్తులను తొలగించారని విమర్శించారు. ‘వందేమాతరం అనేది ఒక మంత్రం.. నినాదం.. ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తిని, ప్రేరణను ఇచ్చింది. త్యాగానికి, తపనకు మార్గాన్ని చూపింది. వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకకు మనం సాక్షులుగా మారడం గర్వకారణం. ఇది ఒక చారిత్రక క్షణం. పలు చారిత్రక సంఘటనలను మైలురాళ్లుగా జరుపుకుంటున్న కాలం ఇది. ఇటీవలే మనం 75 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం. దేశం.. సర్దార్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకుంటోంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు.