కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా తీవ్రంగా విఫలమైందని.. రాహుల్గాంధీ నాయకత్వమే మోదీకి బలంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చెన్నైలో మంగళవారం నిర్వహించిన శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ఇగ్నిషన్ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు.
కేటీఆర్
ఇగ్నిషన్ సదస్సులో కేటీఆర్
చెన్నై: కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా తీవ్రంగా విఫలమైందని.. రాహుల్గాంధీ నాయకత్వమే మోదీకి బలంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చెన్నైలో మంగళవారం నిర్వహించిన శివ్ నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక ఇగ్నిషన్ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సదస్సులో రీ బూటింగ్ ది రిపబ్లిక్ అనే అంశంపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలను పంచుకున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఎజెండాను, ఒక మోడల్ను దేశానికి అందించడంలో దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విఫలమైందన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమీ లేదని, రాహుల్గాంధీకి దేశ భవిష్యత్తుపై విజన్ లేదని అన్నారు. దేశంలోని ఆర్థిక వ్యవస్థపై, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై, ఇన్నోవేషన్పై, పారిశ్రామిక ప్రగతిపై రాహుల్ గాంధీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ఏనాడూ చూడలేదని అన్నారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమని, ఆ పని కేవలం ప్రాంతీయ పార్టీలకే సాధ్యం అవుతుందని చెప్పారు. బిహార్ వంటి రాష్ట్రాల్లో తోక పార్టీ లాంటి కాంగ్రెస్.. అనేక స్థానాల్లో పోటీ చేస్తామని మొండికి వేయడం వల్లనే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరిందన్నారు. గతంలో కేసీఆర్ ప్రాంతీయ పార్టీల వేదిక ఒకటి ఏర్పాటు చేసి దేశానికి ప్రత్యామ్నాయ నమూనాను అందించాలని ప్రయత్నం చేశారని, దురదృష్టవశాత్తు అది ముందుకు పోలేదన్నారు. దేశంలోని ప్రతిపక్షం మెడలో కట్టిన పెద్ద మొద్దు లెక్కన రాహుల్ గాంధీ నాయకత్వం తయారైందన్నారు. అందుకే వరుసగా ఒక రాష్ట్రం తర్వాత ఇంకొక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతూ వస్తున్నదన్నారు. ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు లక్ష కోట్ల ప్రాజెక్ట్ వ్యయం లేని కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడడం అయన అజ్ఞానానికి నిదర్శం అన్నారు. దక్షిణాన బీజేపీకి భవిష్యత్తు ఉందని అనుకోవడం లేదని.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించి బలమైన పాఠం చెప్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ పదేళ్లలో విభజన రాజకీయాలను ప్రతి ఇంటికీ తీసుకువెళ్లిందని, అయితే బీజేపీ విభజన రాజకీయాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాలుగా తాము విఫలం అయ్యామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. పదేళ్లపాటు అనేక రంగాల్లో ముఖ్యంగా ఆర్థిక ప్రగతి అద్భుతంగా సాధించిన తెలంగాణ రెండేళ్లలో వెనుకబడడం బాధాకరమన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునాతనమైన టెక్నాలజీలను అందుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఇన్నోవేషన్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. అందుకే టీ-వర్క్స్ వంటి అనేక కొత్త సంస్థలను ఏర్పాటు చేశామని.. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉద్యోగాలపైన స్వల్పకాలమే ఉంటుందని చెప్పారు. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా ఉద్యోగ అర్హతలు కలిగిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను కాలేజీలలో తయారు చేసుకోవడం, ఆ దిశగా కరికులమ్, శిక్షణ వంటి అంశాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడమే అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నారు.