ఇక గూగుల్ రోడ్డు.. టీసీఎస్ వీధి!
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్లో ట్రెండ్ మారుస్తాం రోడ్లకు కంపెనీల పేర్లు పెడతాం భాగ్యనగరం పెట్టుబడులకు గమ్యస్థానం వసతులు, భద్రతకు మాది హామీ యూఎస్ఐఐఎస్పీఎఫ్లో సీఎం రేవంత్ న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబర్ 13 (ఈవార్తలు): హైదరాబాద్లో రోడ్లకు నాయకుల పేర్లకు బదులు, కంపెనీల పేర్లు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూస ధోరణికి స్వస్తి పలికి, కొత్త ట్రెండ్ను ప్రవేశపెడతామని చెప్పారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల పేర్లు పెడతామని తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన అమెరికా - భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (యూఎస్ఐఐఎస్పీఎఫ్) సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్యస్థానమని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో హైదరాబాద్ నగరం ఉందని చెప్పారు. అందువల్లే ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు అత్యుత్తమ గమ్యస్థానమని వివరించారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కుండబద్ధలు కొట్టారు. తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారని వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని తెలిపారు. జీసీసీలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరుతూ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సదస్సులో వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే నూతన నగరంగా మారుతుందని చెప్పారు. మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని వివరించారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్- ఆర్ఆర్ఆర్ మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల పురోగతిని వివరించిన సీఎం రేవంత్ రెడ్డి... చైనా +1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందని చెప్పారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని చెప్తూ, ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించారు.