ఈ వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.
స్టాక్ మార్కెట్లు
ముంబై: ఈ వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీనికి తోడు హెవీవెయిట్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ జోరును చివరి వరకు కొనసాగించలేకపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 64.77 పాయింట్ల నష్టంతో 85,641.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27.20 పాయింట్లు కోల్పోయి 26,175.75 వద్ద ముగిసింది. రెండో త్రైమాసికం జీడీపీ వృద్ధి మెరుగ్గా నమోదు కావడం, రూపాయి విలువ బలహీనపడటంతో డిసెంబర్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లు ఒక రేంజ్కే పరిమితమయ్యాయని వారు పేర్కొన్నారు. దీనికి తోడు నవంబర్లో జీఎస్టీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా సెంటిమెంట్పై ప్రభావం చూపింది. అయితే, ఆటోమొబైల్ రంగం మాత్రం రాణించింది. నవంబర్లో బలమైన అమ్మకాలు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ వంటివి ఈ రంగానికి కలిసొచ్చాయి. నిఫ్టీ ఆటో సూచీ 0.25 శాతం పెరిగింది. మరోవైపు, నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ రంగాలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ సూచీ 0.39 శాతం లాభపడింది. ప్రధాన షేర్లలో బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నష్టపోగా.. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్లలో నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఫ్లాట్గా ముగియగా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ 0.25 శాతం లాభంతో సెషన్ను ముగించింది.