ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతోంది. ఆరో రోజు ఆదివారం దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో 650 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా గత ఆరు రోజుల్లో దాదాపు 3వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి.
ప్రతీకాత్మక చిత్రం
కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం
శంషాబాద్లో 116 ఫ్లైట్స్ క్యాన్సిల్
శంషాబాద్, డిసెంబర్ 7 (ఈవార్తలు), న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కొనసాగుతోంది. ఆరో రోజు ఆదివారం దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో 650 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా గత ఆరు రోజుల్లో దాదాపు 3వేలకుపైగా విమానాలు రద్దయ్యాయి. దాంతో దేశంలో విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. లక్షలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నది. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో ఏకంగా 117 సర్వీసులను రద్దు అయ్యాయి. వరుసగా విమానాలు రద్దు కావడంతో వేల మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ అధికారుల వివరాల ప్రకారం, ఆదివారం రద్దయిన విమానాల్లో 61 బయలుదేరేవి (డిపార్చర్స్), 56 వచ్చేవి (అరైవల్స్) ఉన్నాయి. శుక్రవారం (155), శనివారం (144) రద్దులతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే అయినప్పటికీ, ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం తగ్గలేదు. డిసెంబర్ 2 నుంచి ఇప్పటివరకు శంషాబాద్ విమానాశ్రయంలో 500కు పైగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. విమానాల రద్దుతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అదనపు భద్రతను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, విశాఖపట్నం, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు, విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా 10 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పైస్జెట్ అదనపు విమానాలను నడుపుతోంది. ఆర్టీసీ బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే కూడా చెన్నై, ముంబై, కోల్కతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన అయ్యప్ప భక్తుల కోసం కొచ్చికి కొన్ని ప్రత్యేక విమానాలను నడిపారు