ఇదేదో సోది కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం... వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపు తిప్పనున్న నిజం. ఒకనాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం... సాక్ష్యాలతో సహా లభించింది.
ప్రతీకాత్మక చిత్రం
సీతను దాచిపెట్టిన లంక దొరికింది..
ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి
లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది..
రామ రావణ యుద్ధం జరిగిన లంక దొరికింది.
ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి పురాణం అంతకంటే కాదు..
లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ..
ఒక మహా అసురుని ఉనికిని చాటి చెప్తున్న కథ..
మిథ్యగా భావిస్తున్న చరిత్ర.. రావణ రహస్యమిది!
ఇదేదో సోది కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి నిజం... వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ చరిత్రను గొప్ప మలుపు తిప్పనున్న నిజం. ఒకనాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం... సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి వుండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే వున్నాడు.. ఇది నిప్పులాంటి నిజం. లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక. శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది. రావణ ఆనవాళ్లు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం.. ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలో మొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తకూ అంతుపట్టలేదు.. అశోక వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ వుంటాయి. ఈ ప్రదేశంలో ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి. సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని అర్చించేవాడు రావణుడు. ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపి స్థల పురాణాలు చెప్పటం సహజమే. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్లు కూడా ఇలాంటివే అనుకుంటే పొరపాటే. ఇవాల్టి శ్రీలంకలో నాటి తేజోమయ రావణ లంక స్మృతులు చాలా ఉన్నాయి. త్రేతాయుగాన్ని మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక.. రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్ ఆకృతి నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది. ఇది ఆంజనేయుడు సంజీవని తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ.. కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్... ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం. దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే వైద్యం చేసుకుంటారు. విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి కావలసి ఉంటుంది. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో మాత్రమే కామన్గా కనిపిస్తుంది. రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు.. అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన రాక్షసుదో మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా. రావణుడి అస్తిత్వాన్ని, అతని శక్తిసామర్ధ్యాలను చాటి చెప్పే మరో ప్రబలమైన సాక్ష్యం ఇది. మీకు పుష్పక విమానం గుర్తుంది కదా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు. రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.
లంకాపట్టణంలో రావణుడు నిర్మించిన అయిదు విమానా శ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది. వీటిని హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు. లంకలో ఒక గరుడ పక్షి ఆకృతిలో లోహపు బొమ్మ దొరికింది.. ఈ బొమ్మ మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహయంత్రం. వేల ఏళ్ల నాటిది. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా పరిశోధిస్తూనే ఉంది. ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక రీసర్చ్ టీమ్ నిర్ధారించింది. మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులున్నాయి. ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది. ఇక్కడి రాళ్లు కాలి కనిపిస్తున్నాయి. 8 వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం. లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి ట్రాన్స్పోర్ట్ సిస్టము, కమ్యునికేషన్ వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం. పుష్పక విమానం చాలా పెద్దది. 63.5 అడుగుల పొడవైనది. 231 4" ఎత్తు. 195'8" వెడల్పున్న రెక్కలు కలిగింది. బయటి ఉపరితలం వెండి రంగులో మిలమిల మెరుస్తుంది. దాని ఇంజన్ ఉరుముల వంటి ధ్వనిని వినిపించేది. గంటకు దాదాపు 250 మైళ్ల వేగంతో ప్రయాణించేది, అందువల్లే సూర్యాస్తమయం లోగా అయోధ్యకు చేరుకోవాలంటే పుష్పకంలో ప్రయాణించాలని విభీషణుడు రాముడిని కోరాడు. అరు గంటల్లో 1400 కిలోమీటర్లను అది కవర్ చేస్తుందిట. లక్జరీ సీట్లు, ఇంటీరియర్, ఎక్స్ప్లోరియల్ డెకొరేషన్లతో ఆధునిక విమానాలకు తీసిపోని విధంగా పుష్పకం ఉండేది. లోపల మెలోడీ సంగీతం కూడా వినిపించే ఏర్పాట్లు చేశాడట రావణుడు. ప్రస్తుత విమానాల్లో ఫస్ట్ క్లాస్, ఎకానమీ క్లాస్లు ఉన్నట్లే పుష్పకంలోనూ వున్నాయి. మొదటి పోర్షన్లో రాముడు కూర్చుంటే, రెండో పోర్షన్లో వానరులు కూర్చున్నారట. దాదాపు 200 మందికి పైగా పుష్పకంలో కూచున్నారు కాబట్టే ఎందరు కూచున్నా ఒకరికి చోటుం టుందనే మాట ప్రచారంలోకి వచ్చింది.
రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత తులసీదాస్ రామచరిత మానస్లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. ఇవన్నీ మనకు ఇప్పుడు లంకలో కనిపిస్తున్న ఆనవాళ్లతో సరిపోలుతున్నాయి. తులసీదాస్ రాసిన రామచరితమానస్ ఒరిజినల్ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో వుంది. ఒక్కో పేజీకి 7లైన్లు రాసి ఉంది. అందులోనే ఈ వివరాలు ఉన్నాయి. కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం.. ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు.. ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక పార్లమెంటులో విభీషణుడి ఫోటో కనిపిస్తుంది. ఆ తరువాత రోలియా.. ఇక్కడే అశోక్ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ ఓ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి అలోపతీ మాత్రల్లాంటివి.. ఈ గోళీలు దొరడమే భాగ్యంగా ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి. చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక ప్రభుత్వం జపాన్కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య లక్షణాలు ఉన్నట్లు.. దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటివరకు లభించిన ఆధారాలన్నీ ఒక ఎత్తైతే, అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అతి కీలక సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ.
లంకలో రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామచంద్రుడు హతమార్చాడు. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి రామాయణంలో రావణుడి అంత్యక్రియలు, ఆ తరువాత విభీషణుడి పట్టాభిషేక కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు లక్ష్మణుడిని రాముడు లంకకు పంపిస్తాడు. కానీ రావణుడి అంత్యక్రియలు జరగనే లేదన్నది కొందరి విశ్వాసం. దానికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి తెచ్చింది లంక సర్కారు.. అదే రావణ గుహ. శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలో ఎత్తైన ప్రదేశంలో ఈ గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు. అది అవణుడి భౌతిక శరీరమని చాలా మంది విశ్వాసం.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడలు)తో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరణాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి. రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవనితో తమ రాజు పునర్జీవుతుడవుతాడని నమ్ముతున్నారని స్థానికుల అభిప్రాయం. కానీ వారిని చూసినవారెవరూ లేరు. రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి. దీనితో పాటు లంకలో మరికొన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంది. రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు? అని అడిగితే టక్కున వచ్చే జవాబు అశోక వనం.. కానీ లంక అదే శ్రీలంకలో సీన్ వేరేలా ఉంది. సీతాదేవిని పరిస్థితులను బట్టి, ముందు జాగ్రత్త చర్యగా వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట. పంచవటిలో, పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్ తోటలోని తన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు.. పక్కనే ఉన్న తన భార్య మండోదరిదేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడు.
లంకాపురంలో అతిగొప్ప ప్యాలెస్ మండోదరికి ఉండేదిట.. చుట్టూ జలపాతాలు.. పూల తోటలు. అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే. ఆ తరువాత అశోకవాటికకు తరలించాడు. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది. అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడు.. ఆకాశమార్గంలో లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్ వ్యూ ద్వారా సీతాదేవికి వర్ణిస్తూ చూపించాడట రావణుడు. అశోక వాటికకు సమీపంలోనే సీతా పకన్ అనే చిన్న ప్రాంతం ఉంది.. చుట్టూ కమ్ముకుని ఉన్న డట్టమైన అడవి.. నిటారుగా నిలుచుని వున్న వృక్షాల మధ్య 200 గజాల మేరకు వున్న చిన్న స్థలం.. అంత అడవిలో ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు.. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట.. సీతాదేవి లంకనుంచి అయోధ్యకు వెళ్లిన తరువాత ఇది పూర్తిగా జై అయిపోయింది. హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సం అంతా చేసేశాక, ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించాడట. అంటే ఏరియా ఆఫ్ వుమెన్ అని అర్ధం. ఇక్కడి నుంచి కూడా రావణ గోడా అనే ప్రాంతానికి సీతను షిఫ్ట్ చేసినట్లు చెప్తారు.. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉ ౦ది. దానికి దగ్గరలోనే దిశృంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది. దీంతో పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది. రావణ సంహారం తరువాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే... ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్తూపాన్ని కూడా నిర్మించారు.. లంకలోని జెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం... ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది.. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి చిత్రపటం మనకు కనిపిస్తుంది.. అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు. రావణుడి కొడుకు ఇంద్రజిత్.. ఇతను కూడా శివుడికి మహా భక్తుడు.. ఈతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాల్టికీ పూజలందుకుంటున్నాయి.
రావణుడి తల్లి కేకసి.. ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది.. ఆమె నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది.. శ్రీలంకలోని తిరుక్కోవిల్లో ఆమె తల్లి భవంతి ఉండేది.. ఇప్పుడా ప్రాంతంలో దేవాలయం ఉంది.. ఇక్కడో విచిత్రం ఉంది.. తన తల్లి మరణించిన తరువాత ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరవైందట.. అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టాడట.. దీంతో ఏడు ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు. రకాలుగా ఉండటం ఇక్కడి విచిత్రం. తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది.. లంకారాజ్యానికంతటికీ అదే ఏకైక డైరీఫారమ్.. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట వుండేది.. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు.. దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది.. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్ హౌస్ కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి.. లంకాదహనం చేశాక ఓ ప్రాంతంలో కాసేపు రెస్ట్ తీసుకున్నాడు.. దాన్ని ఇప్పుడు రామ్ బోడా అంటారు.. అక్కడ చిన్మయ మిషన్ వాళ్లు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు.. రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు.. లంకలో కనిపిస్తున్న రావణుడు వేరు.. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు. ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు.. కానీ, రావణుడిలో మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి. రావణుడు ఆర్కిటెక్చర్.. రావణుడు ఏరోనాటికల్ ఇంజనీర్.. రావణుడు డాక్టర్.. రావణుడు వార్ఫేర్ టెక్నాలజిస్ట్.. రావణుడు నిత్య పరిశోధకుడు.. రావణుడు గొప్ప సంగీతవేత్త.. ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి చెస్ను కనుక్కొన్నాడట. ఆమెతో కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణబ్రహ్మ. రావణుడికి సంబంధించి అయిదు విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కొందని చెప్పుకున్నాం. గుర్లపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది. వాల్మీకి రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన వుంది. రావణుడి విమానం పెద్ద నెమలి ఆకారంలో ఉండేదిట.. దీనిని సింహళభాషలో గుర్లపోత అంటారు.. అంటే పక్షి వాహనం అని అర్ధం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు.. అంటే ఎగిరే నెమలి అని అర్థం.
రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది.. లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది.. ఒక యోజనం అంటే 13 కిలోమీటర్లు. ఇవాల్టి శ్రీలంక విస్తీర్ణం, రామాయణంలో పేర్కొన్న గణాంకాలు దాదాపుగా సరిపోతున్నాయి. ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని నిర్మించాడట రావణుడు. ఆనాటి లంకలో నాలుగు లక్షల వీధులు ఉండేవిట. లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ కాలం నాటివే. రావణ ఆర్కిటెక్చరల్ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్ కలిపే నెట్వర్క్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు.. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని స్పష్టంగా తెలుస్తుంది. రావణ గుహకే దాదాపు ఏడు వందల దాకా కిటికీలు ఉన్నాయి. ఎంత గొప్ప నగర నిర్మాణం.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం.. ఎంత గొప్ప నాగరికత.. భారత దక్షిణాపథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక వైభవం విలసిల్లిన లంకానగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది? తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు..? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.. అబ్బురమేస్తుంది. ఒక దారుణమైన తప్పు ఎంత వినాశనానికి దారితీసిందో అర్ధమవుతుంది. పద్నాలుగేళ్ల వనవాసానికి అయోధ్యనుంచి బయలుదేరిన రామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్లాడు. అప్పటికి దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది.. దండకారణ్యంలో రావణుడి గవర్నర్ ఖరుడు పరిపాలన సాగించాడు. రాముడు ఖరదూషణులను ఇక్కడే చంపాడు. పంచవటి నుంచి కిష్కింధకు వెళ్లిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని కలుసుకున్నాడు.. ఆ సైన్యం తోనే శ్రీలంకకు చేరుకున్నాడు.
భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలైమన్నార్ దాకా నిర్మించాడు. వానర సైన్యంలోని నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది. శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నీలవరై పుత్తుర్ దగ్గర మొదట ఆగాడట.. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది. నీలవరై పుత్తుర్ దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి సైన్యం తరలింది.. లగ్గల అంటే టార్గెట్ రాక్ అని అర్థం.. ఈ పర్వత పైభాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది. ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో వుంటుంది. ఈ ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది.. అటు వాయవ్య దిశలో తలైమన్నార్ ఉంటుంది.. రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే.. ఈ తిరుకోణేశ్వరంలోనే రావణుడు తపస్సు చేసేవాడు. ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి దశకంఠుడు నేలకొరిగాడు.. రాక్షస సంహారం జరిగింది. సుందరలంక స్మశానంగా మారిపోయింది.. రావణ సంహారంతో రామాయణం ముగియలేదు.. యుద్ధం తరువాత రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినప్పుడూ లంకలోని కొన్ని ప్రాంతాలలో ఆగాడు. సేద తీరాడు, పరమేశ్వరుని కొలిచాడు. రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు. వందారుమూలైలో ఉన్నప్పుడు రాముడికి అనుమానం కలిగింది.. రావణుడు బ్రాహ్మణుడు.. అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరాడు.. అప్పుడు శివుడు నాలుగు ప్రాంతాలలో శివలింగాల్ని ప్రతిష్టించి పూజించమని రాముడికి సూచించాడట.. దీంతో రాముడు లంకలో మానావారి అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.. దీన్ని రామలింగ శివుడని కొలుస్తారు.. ఆ తరువాత తిరుకోణేశ్వరంలో, అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు... చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. పుష్పకంపై తిరిగి వెళ్తూ, రాముడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లాడని కూడా కథనం చెప్తారు.. మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది.
- కోవెల సంతోష్ కుమార్, రచయిత
ఫోన్ నంబర్: 9052116463