రవీంద్రభారతి/హైదరాబాద్, డిసెంబర్ 2 (ఈవార్తలు): హైదరాబాద్లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతి ప్రాంగణంలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు తీవ్ర వివాదానికి దారితీసింది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి విరుద్ధం
తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్
రవీంద్రభారతి/హైదరాబాద్, డిసెంబర్ 2 (ఈవార్తలు): హైదరాబాద్లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతి ప్రాంగణంలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు తీవ్ర వివాదానికి దారితీసింది. డిసెంబర్ 15న ఎస్పీబీ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా, తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కళకు ప్రాంతీయ హద్దులు లేవని ఒక వర్గం వాదిస్తుండగా, ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని మండిపడుతున్నారు. తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన రవీంద్రభారతిలో కేవలం తెలంగాణకు చెందిన ప్రముఖుల విగ్రహాలే ఉండాలని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ వాదిస్తున్నారు. ఏపీకి చెందిన ఎస్పీ బాలు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘తెలంగాణ గడ్డపై ప్రజాకవి గద్దర్, ప్రముఖ కవి అందెశ్రీ వంటి మహానుభావులకు దక్కాల్సిన గౌరవం ముందు దక్కాలి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేం అంగీకరించబోం’ అని పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో కలిసి విగ్రహ ఏర్పాటు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ బాలు కుటుంబ సభ్యుడు, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ రవీంద్రభారతికి చేరుకుని పృథ్వీరాజ్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కళాకారులను ప్రాంతాల వారీగా చూడటం సరికాదని, సంగీతానికి, కళకు హద్దులు ఉండవని సుధాకర్ పేర్కొన్నారు. కాగా, కొన్నిరోజుల కిందటే శుభలేఖ సుధాకర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగా ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం